మేడ్చల్, ఆగస్టు10 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో లోటు వర్షపాతం నమోదుతో రైతాంగంలో ఆందోళన మొదలైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం వానకాలం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 277.1 మి.మి వాన పడాల్సి ఉండగా 175.5 మి.మి వర్షపాతం మాత్రమే నమోదైంది. గతేడాదితో పోల్చుకుంటే ఈ సీజన్లో తక్కువగానే వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వానలు పడుతున్న జిల్లాలో మాత్రం లోటు వర్షపాతం నమోదైనట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు.
ఇలానే పరిస్థితి కొనసాగితే వాన కాలం పంట సాగుపై ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. జూన్ మొదటి వారంలో పడాల్సిన వానలు జూలై చివరి వారం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో రైతులు ఆలస్యంగా వరి నాట్లు నాటారు. దీంతో వాన కాలం పంటల సాగుపై ఆందోళన మొదలైంది. జిల్లాలో 30,200 ఎకరాలు సాగు విస్తీర్ణంలో ఉంది. వరి పంట నాట్లు 16 వేల ఎకరాల్లో సాగు చేస్తుండగా, మరో 14 వేల ఎకరాలు ఇతరత్రా పంటలు సాగు చేస్తున్నారు.