ఉత్తరాక్షి, నవంబర్ 26: ఉత్తరాఖండ్ ఉత్తర్కాశీలో గత 15 రోజులుగా చిక్కుకుని ఉన్న 41 మంది కార్మికులను రక్షించడానికి ఆదివారం మరో ప్రయత్నానికి అధికారులు శ్రీకారం చుట్టారు. 86 మీటర్ల అడుగున ఉన్న కార్మికులను రక్షించడానికి కొండపై నిలువుగా డ్రిల్లింగ్ చేసే పనిని ప్రారంభించారు. 15 మీటర్లు డ్రిల్లింగ్ చేశామని, ఇప్పటివరకు ఎలాంటి అవాంతరాలు ఎదురు కాలేదని ఎన్హెచ్ఐడీసీఎల్ ఎండీ మహమూద్ అహ్మద్ తెలిపారు.
ఈ నిట్టనిలువు డ్రిల్లింగ్కు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుంటే సుమారు వంద గంటల సమయంలో కార్మికులున్న ప్రదేశానికి చేరుకుంటామని చెప్పారు. కాగా, కొండకు సమాంతరంగా అమెరికాకు చెందిన ఆగర్ మిషన్ ద్వారా చేపట్టిన డ్రిల్లింగ్లో రెండు రోజుల క్రితం బ్లేడ్ ఇనుప రేకులలో ఇరుక్కుపోవడంతో ఆ బ్లేడ్లను వెలికితీయడానికి హైదరాబాద్ నుంచి రప్పించిన ప్లాస్మా లేజర్ కట్టర్ ఆదివారం అక్కడికి చేరుకుంది. దీంతో దాని సహాయంతో పనులు చేపట్టారు. ఇరుక్కుపోయిన షాఫ్ట్, ఆగర్ ఫిన్లను దీని సహాయంతో కట్ చేసి వెలికి తీస్తారు.