న్యూఢిల్లీ : రాజ్యసభలో వెంకయ్య నాయుడు భావోద్వేగ ప్రసంగం చేశారు. తనను ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పినప్పుడు కన్నీళ్లు ఆగలేదన్నారు. తాను అడగకుండానే పార్టీ తనకు ఉప రాష్ట్రపతి పదవిని కట్టబెట్టింది. ఆ రోజు పార్టీని వీడాల్సి వచ్చినందుకు కన్నీళ్లు వచ్చాయన్నారు. బాధతోనే బీజేపీకి రాజీనామా చేశానని వెంకయ్య నాయుడు గుర్తు చేసుకుని, భావోద్వేగానికి లోనయ్యారు.
సభ్యులు సభ గౌరవాన్ని కాపాడాలని కోరారు. ప్రజాస్వామ్యం గౌరవం మరింత పెరిగేలా నడుచుకోవాలని సూచించారు. సభలో మాట్లాడే భాషకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తొలి ప్రాధాన్యం మాతృభాషకు, తర్వాత సోదర భాషకు ఇవ్వాలన్నారు. సభలో మాతృభాషలో మాట్లాడటాన్ని ప్రోత్సహించాను అని చెప్పారు. సభ గౌరవం కాపాడేందుకు కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించాను. సభలో ఎవరూ శత్రువులు ఉండరు.. ప్రత్యర్థులే ఉంటారు. పోటీలో ఇతరులను మించిపోవడానికి మనం కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలన్నది తన కోరిక అని స్పష్టం చేశారు. మీరు చూపించిన ప్రేమకు, ఆప్యాయతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.