తమిళనాడు : తమిళనాడు (Thamilanadu)రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో అనిశ్చితి కొనసాగుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ఆవిర్భవించినప్పటికీ అధికారం మాత్రం ఇంకా అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ గురువారం వరుసగా రెండో రోజు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న టీవీకే అధినేత విజయ్ ప్రతిపాదనను తిరస్కరించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విజయ్ గురువారం లోక్భవన్లో గవర్నర్ను మళ్లీ కలిశారు.
అయితే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు పొందిన తర్వాతే తిరిగి రావాలని గవర్నర్ ఆయనను కోరారని లోక్భవన్ వర్గాలు తెలిపాయి. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే 108 (విజయ్ రెండు స్థానాల్లో గెలవడంతో 107) సీట్లు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118 కోసం 11 సీట్లు తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే చీఫ్ విజయ్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా వివిధ పార్టీల మద్దతును కోరుతున్నాడు.
ఈ క్రమంలో టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చే అంశంపై చర్చించేందుకు విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) పార్టీ హైలెవెల్ కమిటీ సమావేశం ఈరోజు సాయంత్రం (శుక్రవారం) సమావేశం కానున్నది. టీవీకే నుండి అధికారికంగా మద్దతు కోరుతూ లేఖ అందినట్లు వీసీకే చీఫ్ తోల్ తిరుమావలవన్ తెలిపారు. తమ పార్టీ హైలెవెల్ కమిటీ సమావేశమై, వామపక్షాలతో (CPI, CPM) చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. సీపీఐ, సీపీఎం, చెరో రెండు సీట్లలో గెలుపొందగా వీసీకే సైతం రెండు చోట్ల విజయం సాధించింది. వీసీకే, లెఫ్ట్ పార్టీలు ఈరోజు తమ అంతర్గత సమావేశాల్లో తీసుకునే నిర్ణయం తమిళనాడు కొత్త ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించనుంది.