న్యూఢిల్లీ : యూపీ లఖింపూర్ ఖేరి జిల్లాలోని టికునియా హింసాకాండపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. యోగి ఆదిత్యనాథ్ సర్కార్పై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. హింస అనంతరం ట్విట్టర్ ద్వారా వీడియో పోస్ట్ చేసిన ఆయన.. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వానికి సీఎం యోగికి సైతం లేఖ రాశారు. తాజాగా ఆదివారం మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. లఖింపూర్ ఖేరీ హింసను హిందూ వర్సెస్ సిక్కుల మధ్య ఘర్షణగా మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అలాంటి ప్రయత్నం అనైతికమైందని, అసబద్ధం మాత్రమే కాదు.. ఆ గాయాలను మళ్లీ పెంచడం ప్రమాదకరమని వరుణ్ గాంధీ పేర్కొన్నారు.
ఆ గాయాలు నయమవడానికి ఓ తరం పట్టిందని, దేశ ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేయకూడదన్నారు. ఈ నెల 3న లఖింపూర్ ఖేరిలో జరిగిన హింసాత్మక సంఘటన నుంచి ఈ విషయంలో యోగి ప్రభుత్వానికి ఎంపీ లేఖ రాశారు. బాధితుల కుటుంబాలకు న్యాయం చేయడంతో పాటు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లఖింపూర్ ఘటనపై వరుణ్ గాంధీ గురువారం స్పందిస్తూ, నిరసనకారులపైకి కారు దూసుకెళ్లిన వీడియో చాలా స్పష్టంగా ఉందన్నారు. నిరసనకారుల గళాన్ని హత్య ద్వారా నొక్కకూడదన్నారు. రైతులు చిందించిన రక్తానికి జవాబుదారీతనం ఉండాలన్నారు.