Varun Gandhi | బీజేపీ నేత, ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi) ఈ సారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన బీజేపీ టికెట్పై ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ (Pilibhit) నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా పార్టీ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న వరుణ్ గాంధీకి ఈసారి ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇచ్చే అవకాశం లేదని టాక్ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో బీజేపీ టికెట్ నిరాకరిస్తే (if BJP denies ticket).. వరుణ్ గాంధీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు బుధవారం తెలిపాయి. పిలిభిత్ స్థానానికి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను ఆయన ప్రతినిధులు ఢిల్లీ నుంచి యూపీకి ఇప్పటికే తీసుకొచ్చారని తెలిపాయి.
కాగా, ఉత్తరప్రదేశ్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలపై పలు సందర్భాల్లో తన అసమ్మతి గళాన్ని వినిపిస్తూ వచ్చారు. కీలక అంశాల్లో పార్టీ నిర్ణయాలపైనే బహిరంగ విమర్శలు గుప్పిస్తుంటారు. కొంతకాలంగా తన లోక్సభ నియోజకవర్గమైన పిలిభిత్లో క్రియాశీలకంగా ఉంటున్న ఆయన.. పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్కు ప్రతికూలంగా మాట్లాడుతున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారంటూ ఊహాగానాలు కూడా వెలువడ్డాయి.
Also Read..
Tamilisai Soundararajan | ప్రత్యక్ష రాజకీయాల్లోకి తమిళిసై.. తిరిగి బీజేపీలో చేరిన మాజీ గవర్నర్