ముంబై, ఆగస్టు 4: మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్ష రౌత్కు కూడా ఈడీ సమన్లు జారీచేసింది. సంజయ్ రౌత్ను అరెస్టు చేసిన నాలుగు రోజులకే సమన్లు జారీ చేయడం గమనార్హం. ఈ కేసులో ఆమె నుంచి ఈడీ వాంగ్మూలం తీసుకోనున్నట్టు సమాచారం. ఆ తర్వాత కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. పత్రాచాల్ అభివృద్ధి పథకం లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆయనను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రౌత్ కుటుంబానికి దాదాపు కోటి రూపాయలు ముట్టాయని ఆరోపణలు ఉన్నాయి. ఏప్రిల్లోనే హర్ష రౌత్, సంజయ్ రౌత్ సన్నిహితులకు చెందిన దాదాపు 11.15 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అయితే ఈడీని దుర్వినియోగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి. కాగా, తనను కనీసం కిటికీ లేని, వెలుతురు కూడా రాని గదిలో బంధించారని సంజయ్ రౌత్ గురువారం ఈడీ కేసులను విచారిస్తున్న స్పెషల్ కోర్టు జడ్జి ఎంజీ దేశ్పాండేకు తెలిపారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఈడీని కోర్టు ఆదేశించగా.. వెంటిలేషన్ ఉన్న రూమ్కు ఆయనను తరలిస్తామని ఈడీ తరఫు న్యాయవాది తెలిపారు. అలాగే మరో నాలుగు రోజులపాటు రౌత్ను ఈడీ కస్టడీకి అప్పగించింది.