ఓట్ల కోసం ఎన్నికల ముందు ప్రధాని మోదీ ఏదైనా ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం రివాజు. రానున్న యూపీ ఎన్నికల్లో బీజేపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి, హిందువులు ముఖ్యంగా రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న బ్రాహ్మణులను ఆకర్షించేందుకు నెల క్రితం కాశీ కారిడార్ను ఆయన ప్రారంభించారు. ఆ కార్యక్రమానికి విస్తృతమైన మీడియా కవరేజీ లభించేలా కాషాయవర్గాలు జాగ్రత్తపడ్డాయి. అయితే, ఆ కార్యక్రమమే కమలదళానికి ఇప్పుడు కొత్త తలనొప్పులను తీసుకొచ్చింది.
యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ 2017 మార్చిలో బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గోరఖ్పూర్ మఠానికి అధిపతి. అయితే, స్వయంగా మఠాధిపతిగా వ్యవహరించిన ఆయన పరిపాలనపైనే యూపీకి చెందిన మఠాధిపతులు, పూజారులు, అర్చకులు, బ్రాహ్మణులే తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతుండటం చర్చనీయాంశం అవుతున్నది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్సభ నియోజకవర్గంలోని కీలక అసెంబ్లీ స్థానాలు వారణాసి (దక్షిణ), వారణాసి (ఉత్తర), వారణాసి కంటోన్మెంట్ ప్రాంతాల హిందుత్వ సంఘాలు, ఓటర్లను అక్కడి ప్రధాన మఠాధిపతులు, అర్చకులు ప్రభావితం చేయగలరు. ఇక్కడి ప్రధాన ఆలయాలైన కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగ మందిరం, సంకట్ మోచన్ మందిరం (హనుమంతుడి ఆలయం) ప్రధాన అర్చకులు డాక్టర్ కులపతి తివారీ, విశ్వంభర్ నాథ్ మిశ్రా యూపీ బీజేపీపై తాజాగా నిప్పులు చెరిగారు.
శాస్ర్తాన్ని మంటగలిపారు
కాశీ కారిడార్ కోసం బీజేపీ సర్కారు ఎన్నో చిన్న దేవాలయాలను కూల్చేసిందని కాశీ విశ్వనాథ్ మందిరం ప్రధాన అర్చకుడు డాక్టర్ కులపతి తివారీ ఆరోపించారు. కూల్చేసిన ఆలయాలు శివుడు, పార్వతి, విఘ్నేషుడు తదితర దేవతామూర్తులకు చెందినవన్నారు. ‘కాశీలోని ఆ దేవాది దేవతలే బీజేపీని క్రమంగా తుడిచిపెట్టుకుపోయేలా శపిస్తార’ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీ కారిడార్ ప్రారంభోత్సవంలో తాను కూడా పాల్గొన్నానని అయితే, శాస్త్రప్రకారం అక్కడ పూజాధి కార్యక్రమాలు ఏమీ జరుగలేదన్నారు. ప్రధాని గంగలో మునిగే ప్రక్రియ కూడా అశాస్త్రబద్ధంగానే జరిగిందని ఆరోపించారు. ప్రధాన అర్చకుడినైన తనను ఒక మూలకు కూర్చోబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కాశీ కారిడార్ను ఓట్ల కోసమే ప్రారంభించినట్టు ఆరోపించారు.
మాటలన్నీ నీటిమూటలే
రాజకీయాల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ మతాన్ని వాడుకొంటున్నదని సంకట్ మోచన్ మందిరం మహంత్ విశ్వంభర్ నాథ్ మిశ్రా ఆరోపించారు. డిసెంబర్ 13న ప్రధాని గంగానదిలో స్నానం ఆచరించాల్సి ఉండటంతో అక్కడి నీటిని అధికారులు శుద్ధి చేసినట్టు పేర్కొన్నారు. ఆ మరుసటిరోజే ఆ ఘాట్లో మళ్లీ వ్యర్థాలు వచ్చి చేరినట్టు తెలిపారు. గంగానది ప్రక్షాళన వాగ్దానాన్ని బీజేపీ ఎన్నడో మరిచిపోయిందన్నారు.