ముంబై: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రైళ్లపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ రైలు ఒక మార్గంలో కొన్ని గంటలు ఆలస్యంగా నడిచింది. దీంతో ప్రధాన రైల్వే స్టేషన్లో వేచి ఉన్న ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆలస్యం గురించి రైల్వే అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై మండిపడ్డారు. మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది.
షోలాపూర్- ముంబై రూట్లో నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ శుక్రవారం ఉదయం 9.20 గంటలకు పూణే రైల్వే స్టేషన్కు చేరుకోవాల్సి ఉంది. అయితే ఉదయం 11 గంటలు దాటినప్పటికీ ఆ రైలు స్టేషన్కు చేరుకోలేదు. అలాగే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆలస్యంగా నడుస్తున్న సమాచారాన్ని కూడా రైల్వే సిబ్బంది ఎనౌన్స్ చేయలేదు. దీంతో ఆ రైలు కోసం వేచి ఉండి ఎదురుచూస్తున్న ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. రైల్వే అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చివరకు రెండు గంటలు ఆలస్యంగా ఉదయం 11.20 గంటలకు పూణే స్టేషన్కు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు చేరుకుంది. అయితే చివరి నిమిషంలో ఫ్లాట్ఫామ్ నంబర్ మార్చడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. అలాగే వందే భారత్ రైలులో టాయిలెట్లు పరిశుభ్రంగా లేకపోవడంపై మండిపడ్డారు. తొలిసారి కుటుంబంతో కలిసి వందే భారత్ ట్రైన్లో ప్రయాణం కోసం టికెట్లు కొనుగోలు చేసిన తాను చాలా అసంతృప్తి చెందినట్లు ఒక ప్రయాణికుడు వాపోయాడు.