Baba Ramdev | ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ (Yoga guru Baba Ramdev) కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ (Adani ), అంబానీ (Ambani ), టాటా (Tata), బిర్లా (Birla)ల కంటే తన సమయం చాలా విలువైందని అన్నారు. అంతేకాదు, పారిశ్రామికవేత్తలు 99 శాతం తమ సమయాన్ని స్వప్రయోజనాల కోసమే వెచ్చిస్తారని, ఒక ప్రవక్త మాత్రం సమాజం మంచి కోసం సమయం వెచ్చిస్తారని అన్నారు. గోవా (Goa) రాష్ట్రం పనాజీ ( Panaji )లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాబా రామ్దేవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను హరిద్వార్ (Haridwar) నుంచి మూడు రోజుల పర్యటకు ఇక్కడికి వచ్చాను. నా సమయం విలువ అదానీ, అంబానీ, టాటా, బిర్లాల కంటే ఎక్కువ. కార్పొరేట్లు తమ సమయాన్ని 99 శాతం సొంత ప్రయోజనాల కోసం వెచ్చిస్తారు. ఒక జ్ఞాని (Seer) మాత్రం తన సమయాన్ని అందరి మంచి కోసం వెచ్చిస్తారు’ అని బాబా రామ్దేవ్ అన్నారు.
అనంతరం కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ (Shripad Naik), గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Pramod Sawant ) సమక్షంలో పతంజలి (Patanjali ) కంపెనీ సీఈవో, తన సహచరుడు ఆచార్య బాలకృష్ణను ఈ సందర్భంగా బాబా రామ్దేవ్ సన్మానించారు. బాలకృష్ణ తన వృత్తిపరమైన పాలన, పారదర్శక నిర్వహణ, జవాబుదారీతనం కారణంగా నష్టాల్లో ఉన్న పతంజలిని ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.40,000 కోట్ల టర్నోవర్ సంస్థగా మార్చారని కొనియాడారు. పతంజలి లాంటి సామ్రాజ్యాన్ని నిర్మించి ముందుకు తీసుకెళ్లడం ద్వారా భారతదేశాన్ని ‘అల్టిమేట్ గ్లోరియస్’గా మార్చాలనే కలను సాకారం చేసుకోవచ్చని అన్నారు.