ఘజియాబాద్ : దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్లో కొవిడ్ టీకా కొరత ఏర్పడింది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రయివేటు ఆస్పత్రుల్లో కరోనా టీకా అందుబాటులో లేదు. దీంతో వ్యాక్సిన్స్ ఔట్ ఆఫ్ స్టాక్ అని ఆస్పత్రుల ఎదుట పోస్టర్లను ప్రదర్శించారు. టీకా కోసం వచ్చే ముందు ఈ నంబర్కు ఫోన్ చేసి రావాలని సూచించారు. పోస్టర్లపై ఆస్పత్రుల ఫోన్ నంబర్లను రాసి ఉంచారు. టీకా మళ్లీ ఎప్పుడు వస్తుందో చెప్పలేం అని ఆస్పత్రి సిబ్బంది పేర్కొంటున్నారు. టీకా కొరత సోమవారం నుంచి ఏర్పడిందని తెలిపారు.
ప్రతి రోజు 200 మంది దాకా ఇచ్చేవాళ్లం కానీ టీకా కొరత కారణంగా.. సోమవారం రోజు కేవలం 50 మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చామని ఓ ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. టీకా ఎప్పుడు వస్తుందో స్పష్టత లేదన్నారు. టీకా కోసం ఇప్పటికే బుక్ చేసుకున్న వారు తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని వాపోయారు. ఉత్తరప్రదేశ్తో పాటు మరో 8 రాష్ర్టాల్లో కొవిడ్ వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. దీంతో ఇప్పటికే కొవిడ్ టీకా కేంద్రాలను మూసివేశారు. వీలైనంత త్వరగా టీకా పంపిణీ చేపట్టాలని ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.