న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: కరోనాతో తలెత్తిన పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్రం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నదని, దాని ఫలితంగానే దేశంలో కరోనా టీకాకు కొరత ఏర్పడిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. ముందుగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, తర్వాతే ఇతర దేశాలకు టీకా డోసులను ఎగుమతి చేయడం, బహుమతి ఇవ్వడం చేయాలని హితవు పలికారు. ప్రజలు గుమిగూడే కార్యక్రమాలను, ఎన్నికల ప్రచార సభలను రద్దు చేయాలని సూచించారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న రాష్ర్టాల మంత్రులతో సోనియా శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి ఆయా రాష్ర్టాల్లో తీసుకుంటున్న చర్యలను ఆమె సమీక్షించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీఎంలు అమరీందర్ సింగ్ (పంజాబ్), అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), భూపేష్ బఘేల్ (చత్తీస్గఢ్) తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రం ‘ప్రచారం కోసం పాకులాడే ఎత్తుగడలను’ వీడి ప్రజా ప్రయోజనాల గురించి ఆలోచించాలని సోనియా సూచించారు.
దేశంలో కరోనా మరింత విజృంభిస్తున్నవేళ పంజాబ్ ప్రభుత్వం తమవద్ద టీకా నిల్వలు నిండుకుంటున్నాయని ప్రకటించింది. ఇంకా ఐదు రోజుల వరకు సరిపడా మాత్రమే తమవద్ద టీకాలు ఉన్నాయని సీఎం అమరీందర్సింగ్ తెలిపారు.