న్యూఢిల్లీ, ఆగస్టు 20: జైడస్ క్యాడిలా తయారు చేసిన కరోనా టీకా ‘జైకోవ్-డీ’ అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) శుక్రవారం అనుమతినిచ్చింది. గుజరాత్కు చెందిన ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా సొంతంగా ఈ టీకాను అభివృద్ధి చేసింది. ‘జైకోవ్-డీ టీకాను 12 ఏండ్లు వయస్సు నిండిన వారికి వేయవచ్చు’ అని బయోటెక్నాలజీ విభాగం శుక్రవారం తెలిపింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న టీకాలు 18 ఏండ్లు దాటినవారికి ఉద్దేశించినవే. ఇండియాలో పిల్లల కోసం అందుబాటులోకి వచ్చిన మొట్టమొదటి టీకా ఇదే కావడం విశేషం. అంతేకాకుండా ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డీఎన్ఏ ఆధారిత కరోనా వ్యాక్సిన్ ఇది మూడో డోసుల టీకా. మిషన్ కొవిడ్ సురక్షలో భాగంగా బయోటెక్నాలజీ విభాగంతో కలిసి జైడస్ క్యాడిలా ఈ టీకాను అభివృద్ధి చేసింది. ‘జైకొవ్-డీ’కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో)కు చెందిన నిపుణుల కమిటీ ఆమోదం తెలిపి అత్యవసర వినియోగానికి సిఫారసు చేసిన గంటల్లోనే డీసీజీఐ నిర్ణయం తీసుకోవడం విశేషం.
సూది లేకుండానే టీకా
జైకోవ్-డీ టీకాను సూది లేకుండా ‘ఫార్మాజెట్’ అనే పరికరం సాయంతో నొప్పి లేకుండా వేస్తారు. 28 వేలకు పైగా మందిపై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఇది కరోనా వైరస్పై 66.6శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్టు ట్రయల్స్లో తేలింది. ఇప్పటివరకు ఇండియాలో అనుమతి ఉన్న టీకాలు కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వీ, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా కాగా జైకోవ్-డీ ఆరోది. ఏడాదికి 10-12 కోట్ల డోసులు ఉత్పత్తి చేయనున్నట్టు జైడస్ క్యాడిలా వెల్లడించింది.