కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో అడ్మిట్ అయిన కరోనా రోగుల్లో టీకా తీసుకున్న వారే మూడొంతులు ఉన్నారు. నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరిన కరోనా పాజిటివ్ రోగుల్లో మూడొంతుల మంది వ్యాక్సిన్ ఒక డోసు లేదా పూర్తిగా రెండు డోసులు తీసుకున్నవారేనని వైద్యులు తెలిపారు. తేలికపాటి లక్షణాలున్న రోగులు మందులతో కోలుకుంటున్నారని, ఇతర అనారోగ్య సమస్యలున్నవారికి ఆక్సిన్ సపోర్ట్ అవసరమవుతున్నదని చెప్పారు.
ఏఎంఆర్ఐ ఆసుపత్రిలో 24 మంది కరోనా రోగులు చేరినట్లు సీఈవో రూపక్ బారువా తెలిపారు. వీరిలో 60 శాతం మంది కనీసం ఒక డోసు టీకా తీసుకున్నవారేనని చెప్పారు. వీరిలో 15 మంది ఐసీయూలో ఉన్నట్లు వెల్లడించారు. క్రిటికల్ రోగులకు టీకా తొలి డోసు తీసుకున్న వెంటనే కరోనా సోకి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కోల్కతాలోని సీఎంఆర్ఐ ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి. 13 మంది కరోనా రోగుల్లో 9 మంది టీకా వేయించుకున్నారని పల్మనాలజీ డైరెక్టర్ రాజ ధర్ తెలిపారు. 9 మందిలో ఒకరు పూర్తిగా, 8 మంది ఒక డోసు టీకా తీసుకున్నారని చెప్పారు. అయితే టీకా వేయించుకోని వారి కంటే తీసుకున్న వారిలో ప్రాణ ముప్పు తక్కువేనని అన్నారు. కాగా, నగరంలోని పలు ఆసుపత్రుల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.