Uttarkashi Tunnel Collapse | ఉత్తరకాశి టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ఆరు ప్రణాళికలు రూపొందించినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నితిన్ గడ్కరీ, ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామితో కలిసి సిల్కియారాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ పరిశీలించారు. సొరంగంలో చిక్కుకున్న వారిపై ప్రభుత్వం ఆందోళన చెందుతోందన్నారు.
వాటిని బయటకు తీసుకురావడమే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం అన్నారు. ఇది విపత్తుతో యుద్ధమన్నారు. కార్మికులను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పని చేస్తున్నాయన్నారు. టన్నెల నిర్మాణంలో నైపుణ్యం ఉన్న ప్రైవేటురంగ నిపుణులను కూడా పిలిపించారన్నారు. లోపల చిక్కుకున్న వారికి ఆహారం, మందులు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. సొరంగం ఎగువ, కుడి ఎడమల నుంచి డిల్లింగ్ ప్రారంభించినట్లు చెప్పారు. హిమాలయ ప్రాంతంలో నేల వైవిధ్యంగా ఉంటుందని.. కొన్ని చోట్ల నేల మెత్తగానూ, మరికొన్ని చోట్ల రాళ్లు, గట్టి రాళ్లు ఉంటాయన్నారు.
అగర్ మెషిన్తో డ్రిల్లింగ్ ప్రారంభమైందని.. కొంత గట్టిగా ఉండడంతో డ్రిల్లింగ్ సాధ్యం కాలేదన్నారు. సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రైల్వే, ఓఎన్జీసీ, ఐఐటీ నిపుణుల సహాయం తీసుకుంటామన్నారు. మెషిన్ వైబ్రేషన్తో మరిన్ని కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందన్నారు. సొరంగం మధ్య నుంచి ఒక్కసారిగా కుప్పకూలడం ఆందోళన కలిగిస్తోందని గడ్కరీ అన్నారు. 80 మీటర్ల వరకు ఉన్న టన్నెల్లో కాంక్రీట్ పనులు జరుగుతున్నాయన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సాంకేతిక కారణాలపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్రంతో పాటు కేంద్రం ప్రత్యేక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.