ఉత్తర్కాశీ, నవంబర్ 27: అమెరికన్ అగర్ యంత్రం మరోసారి విరిగి పోవడంతో ఉత్తరాఖండ్లో కూలిపోయిన సొరంగంలో సోమవారం రాత్రి 7 గంటలకు మాన్యువల్గా డ్రిల్లింగ్ ప్రారంభించారు. ఇరుకైన ప్రదేశాల్లో బొగ్గును తవ్వేందుకు ఉపయోగించే పద్ధతిలో ర్యాట్ మైనర్స్ కార్మికులు ఈ తవ్వకాన్ని ప్రారంభించారు.
800 ఎమ్ఎమ్ డయామీటర్ల పైపుల గూండా ఈ కార్మికులు లోపలికి వెళ్లి శిథిలాలను పారల ద్వారా తొలగిస్తారు. మరోవైపు సొరంగంపై నిలువుగా చేస్తున్న డ్రిల్లింగ్ 36 మీటర్లు పూర్తయిందని అధికారులు తెలిపారు. బర్కోట్ వైపు నుంచి అడ్డంగా తవ్వడం కొనసాగుతున్నది. కార్మికులను చేరుకోవడానికి మరో 12 మీటర్ల తవ్వకం అవసరం.