డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ (Uttarakhand) సొరంగం కూలిన ఘటనలో బాధితుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది. ప్రమాదం జరిగి (Tunnel Accident) ఇప్పటికే నాలుగు రోజులు గడిచిపోయాయి. వంద గంటలు ముగిసినప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ (Rescue operation) కొనసాగుతూనే ఉన్నది. ఒక్క కార్మికుడు కూడా బయటపడలేకపోయారు (Trappted Workers). దీంతో అందులో చిక్కుకుపోయిన వారి ఆరోగ్యం విషయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నెల 12న (ఆదివారం) ఉదయం ఉత్తరకాశీలో (Uttarkashi) చార్ధామ్ ప్రాజెక్టులో (Chardham Project) భాగంగా నిర్మిస్తున్న సొరంగంలో (Tunnel) కొంతభాగం కూలిపోయింది. దీంతో అందులో పనిచేస్తున్న 40 మంది కార్మికులు చిక్కుకుపోయారు. సొరంగం ప్రవేశ ద్వారం నుంచి 200 మీటర్ల దూరంలో వారంతా చిక్కుకుపోయారు. శిథిలాలు దాని ముందు 50 మీటర్ల వరకు పడిపోయాయి. వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఇందులో భాగంగా థాయ్లాండ్, నార్వేకు చెందిన నిపుణుల బృందాల సహాయం కూడా తీసుకుంటున్నారు. 50 మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న పైపులను శిథిలా గుండా సొరంగంలోకి పంపిస్తున్నారు. దీనిద్వారా కార్మికులను ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, సొరంగంలో ఉన్నవారికి వారికోసం ఆక్సిజన్, నీరు, ఆహారం అందిస్తున్నారు.