డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి(Uniform Civil Code)ని అమలు చేయనున్నారు. దేశంలో ఆ నియమావళిని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలువనున్నది. వచ్చే వారం నుంచి యూనిఫాం సివిల్ కోడ్ను ఉత్తరాఖండ్ అమలు చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రిటైర్డ్ జస్టిస్ రంజన్ దేశాయ్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను సీఎం పుష్కర్ సింగ్ ధామికి అందజేయనున్నారు. దీపావళి తర్వాత ఉత్తరాఖండ్ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నారు. ఆ సమావేశాల్లో ఉమ్మడి పౌర స్మృతికి రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి.
యూసీసీ డ్రాఫ్ట్ కమిటీలో సభ్యుడైన జస్టిస్ రంజన్ దేశాయ్.. ఇటీవల మాట్లాడుతూ ఉమ్మడి పౌర స్మృతికి చెందిన నియమావళి డ్రాఫ్ట్ను పూర్తి చేసినట్లు తెలిపారు. ఆ ముసాయిదా తీర్మానాన్ని పూర్తి చేయడం సంతోషంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. నిపుణుల కమిటీ ఇచ్చే రిపోర్టుతో పాటు తీర్మానాన్ని కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి అందజేయనున్నట్లు జస్టిస్ దేశాయ్ తెలిపారు.
ఉత్తరాఖండ్ బాటలోనే గుజరాత్ కూడా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికలకు ముందే యూసీసీని అమలు చేసేందుకు గుజరాత్ ఆసక్తిగా ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో యూసీసీని అమలు చేసిన రెండవ రాష్ట్రంగా గుజరాత్ నిలువనున్నది.
యూసీసీతో బహుభార్యత్వాన్ని రద్దు చేయనున్నారు. సహజీవనం చేసుకోవాలనుకున్న వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న నిబంధన పెట్టే అవకాశాలు ఉన్నాయి.