డెహ్రాడూన్: బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో నేటినుంచి ఉమ్మడి పౌర స్మృతి (UCC) అమల్లోకి రానుంది. దీంతో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది. ఈ మేరకు సీఎం పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని వెల్లడించారు. చట్టం అమలుపై సంబంధిత అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామని తెలిపారు. యూసీసీ అమలుతో సమాజంలో చాలా విషయాల్లో ఏకరూపత వస్తుందన్నారు. పౌరులందరికీ సమానైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని ప్రకటించారు.
గతేడాది ఫిబ్రవరి 7న యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం పొందింది. 2024, మార్చి 11 ఆ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మార్చి 12న నోటిఫికేషన్ జారీ చేశారు. ఉమ్మడి పౌర స్మృతి 2024 చట్టాన్ని ఈ ఏడాది జనవరి పూర్తిగా అమలు చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. దీని అమలు కోసం ప్రత్యేక పోర్టల్, మొబైల్ యాప్ ఏర్పాటు చేశారు. మహిళలు, పిల్లల సాధికారతే లక్ష్యంగా యూసీసీ అమలు ఉంటుందని సీఎం ధామి గతంలో తెలిపారు. కాగా, పోర్చుగీస్ పాలనలో ఉన్నప్పటి నుంచి గోవాలో ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది.