Uttarakhand : ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఈ మేరకు కేంద్ర వాతావరణ శాఖ ఉత్తరాఖండ్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. డెహ్రడూన్ సహా అనేక జిల్లాల్లో వర్షాలు అధికంగా పడుతున్నాయి. రాబోయే 48 గంటలపాటు ఇక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించిన ఐఎండీ.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే వర్షాల కారణంగా ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది.
వర్షాల వల్ల కొండ చరియలు విరిగిపడటంతో బద్రినాథ్ హైవేతోపాటు, కేదార్నాథ్ మార్గం కూడా నిలిచిపోయింది. చమోలి జిల్లాలోని కేదార్నాథ్ యాత్ర సాగే రుద్రప్రయాగ్ జిల్లాలో ట్రాఫిక్కు ఇబ్బంది కలుగుతోంది. యాత్ర సాగే మార్గంలో భారీగా రాళ్లు, వ్యర్థ పదార్థాలు పడిపోయాయి. దీంతో యాత్రకు తాత్కాలికంగా ఇబ్బంది కలుగుతోంది. భక్తులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. యాత్రామార్గంలోని అడ్డంకులను తొలగిస్తూ, రూట్ క్లియర్ చేస్తున్నారు. ఛార్ధామ్ యాత్రలో భాగంగా భక్తులు కేదార్నాథ్ యాత్ర చేపడుతారు. ఈ మార్గంలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చమోలి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. రాబోయే రోజుల్లో ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.
ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. విపత్తు నిర్వహణ విషయంలో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వేగంగా స్పందించాలని, అన్ని విభాగాలు సహకారం, సమన్వయంతో పని చేయాలని సూచించారు. పర్వత ప్రాంతాల్లో అవసరమైతే ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు.