డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి ఈనెల 23న డెహ్రాడూన్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ధామితో పాటు మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేయనుంది. గత ఏడాది జులైలో నాలుగు నెలల్లో ఉత్తరాఖండ్ మూడవ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ధామి పర్వత రాష్ట్రంలో కాషాయ పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకువచ్చారు.
ఉత్తరాఖండ్లోని 70 స్ధానాలకు గాను 47 స్ధానాల్లో పార్టీని గెలిపించి తన పట్టు నిరూపించుకున్నారు. పార్టీని విజయతీరాలకు చేర్చినా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి భువన్ చంద్ర కాప్రి చేతిలో ధామి 6579 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక డెహ్రాడూన్లో బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ధామి పేరును రక్షణ మంత్రి, పార్టీ కేంద్ర పరిశీలకుడు రాజ్నాధ్ సింగ్ ప్రకటించారు.
ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు మీనాక్షి లేఖి, ప్రహ్లాద్ జోషీలు హాజరయ్యారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన అనంతరం ధామి మాట్లాడుతూ కాషాయ పార్టీని మరోసారి ఆదరించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతి సహా ఎన్నికలకు ముందు తాము ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు.