డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని రిసార్టులో హత్యకు గురైన 19 ఏండ్ల రిసెప్షనిస్ట్ అంకితా భండారి కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ జరుగనున్నది. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించనున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ దామి బాధితురాలి కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. అంతేగాక అంకిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు.
రిసెప్షనిస్ట్ అంకితా భండారి సెప్టెంబర్ 18న వనాంతర రిసార్టులో హత్యకు గురయ్యారు. రిసార్టు ఓనర్ పుల్కిత్ ఆర్యనే ఆ రిసార్టు మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాతో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దాంతో ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పుల్కిత్ ఆర్య బీజేపీ సీనియర్ నేత వినోద్ ఆర్య కుమారుడు కావడంతో.. పార్టీ ఆయనను రాష్ట్ర బీజేపీ నుంచి తొలగించింది.
అంకితా భండారీ సెప్టెంబర్ 18న కనిపించకుండా పోతే మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పుల్కిత్ ఆర్య అతని మేనేజర్లే హంతకులుగా సెప్టెంబర్ 22న తేల్చారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు సెప్టెబర్ 23న రిసార్టు సమీపంలోని ఓ నాలా నుంచి అంకిత మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ దారుణ ఘటనపై విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించనున్నట్లు సీఎం దామి హామీ ఇచ్చారు.