చమోలి: ఉత్తరాఖండ్లోని కర్ణ్ప్రయాగ్లో కూడా జోషీమఠ్ తరహా పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. చాలామంది వారి ఇండ్లను వదిలి వేరే చోట్లకు వెళ్తున్నారు. పలు చిన్న చిన్న కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. దీంతో కర్ణ్ప్రయాగ్ ప్రజలు తమను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. స్థానిక మున్సిపాలిటీ కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ సాయాన్ని అభ్యర్థించింది. ఈ పట్టణంలో 50 ఇండ్లకు పగుళ్లు ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు.
కూల్చివేతలకు చర్యలు
జోషీమఠ్లో పగుళ్లు ఏర్పడి ఒరిగిపోతూ ప్రమాదకరంగా ఉన్న మలరి ఇన్, మౌంట్ వ్యూ హోటళ్లను కూల్చేసేందుకు ఎస్డీఆర్ఎఫ్ సిద్ధమైంది. అయితే, తమకు పరిహారం ఇచ్చిన తర్వాతనే కూల్చివేయాలని హోటళ్ల యాజమానులు ఆందోళనకు దిగారు. ఎన్టీపీసీ తపోవన్ – విష్ణుగడ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా స్థానికుల ఆందోళన కొనసాగుతున్నది.
ఏటా 6.5 సెం.మీ కుంగుతున్న జోషీమఠ్
జోషీమఠ్ మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ సంస్థ అధ్యయనంలో తేలింది. ఈ మొత్తం ప్రాంతం ఏడాదికి 6.5 సెంటీమీటర్ల చొప్పున కుంగిపోతున్నదని వెల్లడైంది. జోషీమఠ్లో పరిస్థితిని జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.