లక్నో: సోషల్ మీడియాలో రీల్ కోసం ఐదుగురు యువకులు పురాతన నీటి ట్యాంక్పైకి ఎక్కారు. కిందకు దిగుతుండగా దాని మెట్లు విరగడంతో ముగ్గురు కిందపడ్డారు. వీరిలో ఒకరు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. వాటర్ ట్యాంక్పై చిక్కుకున్న మరో ఇద్దరు యువకులను హెలికాప్టర్ ద్వారా ఎయిర్ఫోర్స్ సిబ్బంది రక్షించారు. (Air Force Rescues Teens) ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థనగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కాన్షీరామ్ ఆవాసియ్ కాలనీకి చెందిన ఐదుగురు యువకులు రీల్ రికార్డ్ చేసేందుకు శనివారం మధ్యాహ్నం 1 గంటకు స్థానికంగా ఉన్న పురాతన వాటర్ ట్యాంక్పైకి ఎక్కారు.
కాగా, రీల్ రికార్డ్ తర్వాత ఆ యువకులు కిందకు దిగేందుకు ప్రయత్నించారు. అయితే పాత మెట్లు విరిగిపోవడంతో ముగ్గురు యువకులు కిందపడ్డారు. వీరిలో సిద్ధార్థ్ అక్కడికక్కడే మరణించాడు. షాని, గోలు అనే ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు వాటర్ ట్యాంక్ మెట్లు విరిగిపోవడంతో మిగతా ఇద్దరు యువకులైన పవన్, కల్లు దానిపై చిక్కుకున్నారు. ఆ ఇరుకైన ప్రాంతానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, అగ్నిమాపక సిబ్బంది చేరుకోలేకపోయారు. దీంతో ఇద్దరు యువకులు రాత్రంతా అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత వాయుసేన సహాయాన్ని అధికారులు కోరారు.
కాగా, ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు సెంట్రల్ ఎయిర్ కమాండ్కు చెందిన ఐఏఎఫ్ ఎంఐ-17 వీ5 హెలికాప్టర్ అక్కడకు చేరుకున్నది. పురాతన వాటర్ ట్యాంక్పై 16 గంటలుగా చిక్కుకున్న పవన్, కల్లును ఐఏఎఫ్ సిబ్బంది రక్షించారు. వారిద్దరిని హెలికాప్టర్లో గోరఖ్పూర్ తరలించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతో సహా పలువురు ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A night of terror ends in a miracle! 🚁 After 16 grueling hours stranded atop a crumbling water tank in Siddharthnagar, two young lives were saved by the sheer skill of the #IndianAirForce. A tragic accident turned into a heroic rescue operation at dawn. Immense gratitude to our… pic.twitter.com/jHoQvR0Qsd
— SILENT BRIEF (@SilentBriefHQ) May 3, 2026