Jayaprada | రామ్పూర్, డిసెంబర్ 29: బీజేపీ నాయకురాలు, నటి జయప్రద కోసం ఉత్తరప్రదేశ్ పోలీసులు తెగ వెతుకుతున్నారు. 2019లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని పలుమార్లు జడ్జి ఆదేశించినా ఆమె హాజరు కాలేదు. దీంతో జడ్జీ ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.
జనవరి 10లోగా ఆమెను తన ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించారు. దీంతో రామ్పూర్ ఎస్పీ ఆమెను వెతకడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ బృందం కూడా ఆమె ఆచూకీని కనిపెట్టలేకపోయింది. ఏప్రిల్ 19, 2019న జయప్రద ఎన్నికల నియమావళికి విరుద్ధంగా యూపీలోని స్వర్ ప్రాంతంలో ఉన్న నూర్పూర్ గ్రామంలో రోడ్డును ప్రారంభించారు. పిప్లియా మిశ్రా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.