లక్నో: రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం మహిళలకు అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రంగా మారిందని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జాలౌన్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
రెండు రోజుల క్రితం ఓ బాలిక తప్పిపోయింది. ఈ రోజు ఆమె శవమై కనిపించింది. దీనికి ఎవరు బాధ్యతవహిస్తారు అని ప్రశ్నించారు. బాబా చీఫ్ మినిస్టర్ బాధ్యతవహిస్తాడా అని సీఎం యోగీ ఆదిత్యనాథ్ను ఉద్దేశించి అన్నారు. గణాంకాల ప్రకారం మహిళలకు రక్షణలేని రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచిందని వెల్లడించారు.
నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన 750 మంది రైతుల చావుకు బీజేపీ కారణమైంది. మరోసారి రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో వస్తే అలాంటి చట్టాలను మరోసారి తీసుకొచ్చి మీ భూములను అమ్ముకుంటుందని విమర్శించారు. వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించుకున్నప్పటికీ ఆ పార్టీని రైతులు నమ్మడం లేదరన్నారు.
ఉత్తరప్రదేశ్లో ఏడు విడుతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయి. ఆదివారం మూడో విడుత పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.