Noida Protests : వేతనాలు పెంపు, కనీస హక్కుల కోసం నోయిడా కార్మిక వాడలోని ఫేజ్2లో కార్మికులు చేపట్టిన నిరసన సోమవారం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్మికుల డిమాండ్లపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. కార్మికులకు కనీస సగటు వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అన్ని స్థాయిల్లోని కార్మికులు ఇది వర్తిస్తుందని తెలిపింది.
నిరసనలు జరిగిన గౌతమ్ బుద్ధనగర్ జిల్లా మేజిస్ట్రేట్ మేధా రూపం ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ సూచనలకు అనుగుణంగా వేతనాలు పెంచుతూ సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయం తీసుకున్నట్లు మేధా రూపం తెలిపారు. వేతనాల పెంపు నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందన్నారు. ఈ కమిటీ నిర్ణయం ప్రకారం.. గౌతమ్ బుద్ధనగర్, ఘజియాబాద్ పరిధిలోని అన్ స్కిల్డ్ వర్కర్స్కు నెలకు కనీస వేతనం రూ.13,690గా నిర్ణయించారు. అంతకుముందు ఈ వేతనం రూ.11,313గా ఉండేది. సెమీ స్కిల్డ్ వర్కర్స్కు నెలకు రూ.15,059, స్కిల్డ్ వర్కర్స్కు రూ.16,868 అందిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్స్కిల్డ్ కార్మికులకు నెలకు రూ.13,006, సెమీ స్కిల్డ్ వర్కర్స్కు రూ.14,306, స్కిల్డ్ వర్కర్స్కు రూ.16,025 వేతనం అందిస్తారు.
యూపీలోని మిగతా జిల్లాల్లో అన్స్కిల్డ్ కార్మికులకు నెలకు రూ.12,356, సెమీ స్కిల్డ్ వర్కర్స్కు రూ.13,591, స్కిల్డ్ వర్కర్స్కు రూ.15,224 వేతనం అందిస్తారు. ఎంప్లాయర్స్ అసోసియేషన్స్, లేబర్స్ యూనియన్లను సంప్రదించిని అనంతరం ఈ మార్పులపై నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం వేతనాల పెంపుపై నిర్ణయం ప్రకటించినప్పటికీ మంగళవారం కూడా చాలాచోట్ల కార్మికులు నిరసనలు కొనసాగిస్తున్నారు.