న్యూఢిల్లీ, జూలై 22: భారతీయ విద్యార్థుల్లో చాలామందికి అమెరికాలోని పలు టాప్ యూనివర్సిటీల్లో సీటు ఖరారైనప్పటికీ ఆ దేశానికి వెళ్లడానికి అవసరమైన వీసా ప్రక్రియ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. మరికొద్ది వారాల్లో ఓరియంటేషన్ ప్రారంభం కానున్నదని కానీ ఎఫ్-1 వీసా అపాయింట్మెంట్ స్లాట్లు మాత్రం అందుబాటులోకి రాలేదని పలువురు విద్యార్థులు వాపోతున్నారు.
ఆరు నెలల నుంచి ఎఫ్-1 వీసాకు సంబంధించిన స్లాట్ను మూసివేసినట్టు సమాచారం. వీసా అపాయింట్మెంట్లు ప్రారంభించారేమోనన్న ఆశతో రోజుకు పలుమార్లు యూఎస్ వీసా పోర్టల్ను చెక్ చేస్తున్నామని, కానీ తమ ఆశలు తీరడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అమెరికాలోని 15 టాప్ బిజినెస్ విద్యా సంస్థల్లో సీటు సాధించిన ఎంబీఏ విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది.
‘ఆగస్టు 11న ఓరియంటేషన్ ప్రారంభం కానుండగా, ఆగస్టు 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఫీజు చెల్లింపుల విషయంలో మా స్కూల్ కొంత ఉదారంగా ఉన్నప్పటికీ లోన్ పొందకుండా నేను ఫీజు కట్టే పరిస్థితి లేదు. వీసా అపాయింట్మెంట్ లేకుండా లోన్ విడుదల కాదు’ అని ఓ విద్యార్థి వాపోయారు. సమయం ముంచుకొస్తుండటంతో పలువురు విద్యార్థులు ప్రధాన మంత్రి కార్యాలయానికి, విదేశాంగశాఖకు జోక్యం చేసుకోవాలని కోరుతూ మూకుమ్మడిగా లేఖలు రాశారు. ఈ లేఖలపై దాదాపు వెయ్యి మంది వరకు సంతకాలు చేసినట్టు తెలిసింది.