చైనా మాయలో పడి… తీసుకున్న ఒకే ఒక నిర్ణయం పాకిస్తాన్ను సంకట స్థితిలోకి నెట్టేసింది. అన్ని ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుందో, లేదంటే.. అలవోకగా ఆ నిర్ణయానికి వచ్చిందో తెలియదు కానీ… పాకిస్తాన్ ఇప్పుడు అమెరికాను ప్రసన్నం చేసుకోవడానికి పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నిర్వహించిన ప్రజాస్వామ్య వర్చువల్ సదస్సుకు పాకిస్తాన్ డుమ్మా కొట్టింది. ఈ నిర్ణయమే ఇప్పుడు పాకిస్థాన్ను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. తాము ఎందుకు ఈ సదస్సుకు గైర్హాజరయ్యామో అమెరికాకు వివరించేందుకు పాకిస్తాన్ నానా తంటాలు పడుతోంది.
ఈ విషయంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్కు వివరించడానికి పాకిస్తాన్ అష్టకష్టాలూ పడుతోంది. ఆయనకు వివరిద్దామనుకుంటే అమెరికా విదేశాంగ మంత్రి అస్సలు ఫోన్లో దొరకడం లేదు. చివరికి ప్రయాస పడగా, ప్రయాస పడగా, అమెరికా విదేశాంగ మంత్రి సహాయకుడు వెండి శర్మన్ లైన్లోకి వచ్చారు. ఆయనకు గైర్హాజర్పై పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషీ వివరణ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమ్మిట్కు గైర్హాజర్ కావడంతో అమెరికా తమపై ఎప్పుడు కత్తి దూస్తుందోనన్న ఆందోళనలో పాక్ మునిగిపోయింది.
తప్పు చేశామా? అంతర్మథనంలో దాయాది…
చైనా మార్గనిర్దేశనంలో అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ నిర్వహించిన వర్చువల్ సమ్మిట్కు పాకిస్తాన్ డుమ్మా అయితే కొట్టింది. ఆ తర్వాత ఏం చేద్దాం? అన్న అంతర్మథనంలో పాకిస్తాన్ మునిగిపోయినట్లు తెలుస్తోంది. తాము చాలా పెద్ద తప్పు చేశామని, నాలుక్కరుచుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా విదేశాంగ శాఖతో పాకిస్తాన్ జరిపిన సంభాషణ, వివరణ ఇచ్చుకున్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పొక్కవద్దని పాక్ నిర్ణయించుకుంది. అయితే తాము ఎవరి ప్రభావంలోనూ పడి సమ్మిట్కు హాజరు కావొద్దని నిర్ణయించుకోలేదని, అది తమ సొంత నిర్ణయమేనని పాక్ పేర్కొంటోంది. ఇంత జరుగుతున్నా…. చైనా మాత్రం కిమ్మనకపోవడం గమనించాల్సిన అంశం.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆధ్వర్యంలో వర్చువల్ సమ్మిట్
ప్రజాస్వామ్యంపై అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ డిసెంబర్ 9,10 తారీఖుల్లో వర్చువల్ సమ్మిట్ను నిర్వహించారు. ఈ సమ్మిట్కు తాము హాజరుకావడం లేదని దాయాది పాక్ ప్రకటించింది. ఈ సమ్మిట్ ప్రారంభమయ్యే రోజునే పాకిస్తాన్ ఈ ప్రకటన చేయడం గమనించాల్సిన అంశం. ఈ సమ్మిట్కు భారత్తో సహా మరో 100 దేశాలు పాల్గొన్నాయి. పాక్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక చైనా ప్రభావం ఉందని, ఆ ప్రభావంలో పడే పాకిస్తాన్ ఈ సమావేశానికి గైర్హాజరవుతోందని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక.. ఈ సమావేశానికి దక్షిణ ఆసియా నుంచి భారత్, పాక్, మాల్దీవ్, నేపాల్ దేశాలను అమెరికా ఆహ్వానించింది. చైనా, రష్యా దేశాలకు అసలు ఆహ్వానమే పంపలేదు. చైనా బద్ధ శత్రువైన తైవాన్కు ఆహ్వానం పంపడం గమనించాల్సిన పరిణామం.