న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: అమెరికాతో ఎంతోకాలంగా వాయిదా పడుతూ వస్తున్న వాణిజ్య ఒప్పందంపై కీలకమైన ముందడుగు పడింది. వాణిజ్య ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సోమవారం రాత్రి తన సోషల్మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. భారత ప్రధాని మోదీతో ఫోన్ సంభాషణ తర్వాత ఒప్పందం ఖరారైనట్టు ట్రంప్ ప్రకటించారు. ఇందులో భాగంగా భారత్పై ప్రతీకార సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపారు. అంతేగాకుండా రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుందని చెప్పారు. అలాగే అమెరికాపై సుంకాలను సున్నాకు తగ్గించబోతున్నదని ప్రకటించారు.
వాణిజ్య ఒప్పందానికి భారత్-అమెరికా అంగీకరించాయని, దీంతో భారత్పై తాను విధించిన ప్రతీకార సుంకాలను 25 నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. తన ఈ చర్య స్నేహం, గౌరవానికి చిహ్నంగా ట్రంప్ పేర్కొన్నారు. ‘అమెరికాపై విధిస్తున్న సుంకాలను పూర్తిగా ఎత్తివేసేందుకు భారత్ ముందుకొస్తుంది.సుమారు 500 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఇంధన, సాంకేతిక, వ్యవసాయ, బొగ్గు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని మోదీ హామీ ఇచ్చారు’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై విధించిన 25 శాతం అదనపు సుంకాల తగ్గింపుపై ఎలాంటి స్పష్టత లేదు.
భారత్పై టారిఫ్లు తగ్గించినందుకు ట్రంప్నకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారత తయారీ రంగానికి, ఎగుమతులకు ఇది ఊతమిస్తుందని చెప్పారు. రెండు అతిపెద్ద ప్రజాస్వామిక దేశాల మధ్య ఈ ఒప్పందం ఇరుదేశాల ప్రజలకు అనేక అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, సుస్థిరతకు ట్రంప్ నాయకత్వం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
అంతకుముందు ట్రంప్-ప్రధాని మోదీ సోమవారం ఫోన్లో మాట్లాడుకున్నారని భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. అయితే ఇరువురు నేతల మధ్య ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్న వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. ‘వేచి చూడండి..’ అనే సందేశాన్ని సెర్గియో గోర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ట్రంప్ ఫోన్ కాల్పై ప్రధాని మోదీ కూడా ‘ఎక్స్’లో స్పందించారు. ట్రంప్తో సంభాషణ అత్యంత ఆకర్షణీయంగా సాగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మరోవైపు భారత్లోని చారిత్రక కట్టడం ఇండియా గేట్ ఫొటోను ట్రంప్ సోషల్మీడియాలో షేర్ చేశారు. ‘భారతదేశపు సుందరమైన విజయస్మారకం ఇది. మనది అన్నింటికన్నా గొప్పగా ఉండబోతున్నది’ అని ఆయన పేర్కొన్నారు. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, వాషింగ్టన్ డీసీలో భారీ కట్టడాన్ని నిర్మించాలని ట్రంప్ భావిస్తున్న నేపథ్యంలో ఈ పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది.