న్యూఢిల్లీ, నవంబర్ 3 : పాకిస్థాన్, చైనా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. రష్యా, ఉత్తర కొరియా కూడా తమ అణ్వస్ర్తాలను పరీక్షించుకుంటున్నాయని తెలిపారు. అణు బాంబులు కలిగి ఉన్న దేశాలు వాటి పరీక్షలను నిర్వహిస్తున్నాయని, ఆ విషయాన్ని మాత్రం అవి వెల్లడించబోవని ట్రంప్ వ్యాఖ్యానించారు. చైనా, పాకిస్థాన్ ఇప్పటికే రహస్యంగా తమ అణు పరీక్షలు నిర్వహించుకుంటున్నాయని ఆయన వెల్లడించారు. రష్యా నిర్వహిస్తోంది.. చైనా నిర్వహిస్తోంది. కాని అవి మాత్రం దాని గురించి మాట్లాడవు. మాది మాత్రం స్వేచ్ఛా సమాజం.
మేము చాలా భిన్నం. అందుకే దాని గురించి మాట్లాడతాము. అంతేగాక అక్కడ జరుగుతున్న పరీక్షల గురించి ఆ దేశంలోని విలేకరులు కూడా ఏమీ రాయరు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియా, పాకిస్థాన్ కూడా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత్, పాకిస్థాన్ ఈ ఏడాది మేలో అణు యుద్ధం అంచుల వరకు వెళ్లాయని, వాణిజ్యం, సుంకాలు బూచిగా చూపించి ఆ యుద్ధాన్ని నివారించానని అదే ఇంటర్వ్యూలో ట్రంప్ పునరుద్ఘాటించారు.
ప్రపంచాన్ని 150 సార్లు పేల్చివేయగల అణు బాంబులు తమ వద్ద తగినన్ని ఉన్నాయని ట్రంప్ ప్రకటించారు. అణ్వస్త్ర పరీక్షలను నిర్వహించాలని అమెరికన్ మిలిటరీకి తాను ఇచ్చిన ఆదేశాలను ఆయన సీబీఎస్కి చెందిన 60 మినిట్స్ ఇంటర్వ్యూలో సమర్థించుకున్నారు. అణు పరీక్షలకు దూరంగా అమెరికా ఒక్కటే ఉండడం తనకు ఇష్టం లేదని ఆయన చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక అణ్వస్ర్తాలు అమెరికా వద్ద ఉన్నప్పటికీ తన సైనిక ప్రత్యర్థులైన రష్యా, చైనా వేగంగా తమ అణు సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతున్నాయని ట్రంప్ తెలిపారు.