న్యూఢిల్లీ: గత ఏడాది సుమారు 14 లక్షల మంది భారతీయులకు అమెరికా వీసాల(US visas)ను జారీ చేసింది. గతంలో ఎన్నడు కూడా ఇంత భారీ స్థాయిలో వీసాలను ఇవ్వలేదు. భారత్లో ఉన్న అమెరికా కౌన్సులర్ బృందం ఈ వీసాలను జారీ చేసింది. దీంతో వీసా అపాంట్మెంట్ కోసం ఎదురుచూసే సమయం 75 శాతం తగ్గిపోయినట్లు యూఎస్ ఎంబసీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పది మంది అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే, దాంట్లో ఒకరు భారతీయుడు ఉన్నట్లు అమెరికా ఎంబసీ తెలిపింది. అన్ని రకాల వీసాలకు డిమాండ్ పెరిగినట్లు కౌన్సులేట్ పేర్కొన్నది. 2022తో పోలిస్తే 2023లో దరఖాస్తుల సంఖ్య 60 శాతం పెరిగినట్లు అమెరికా ఎంబసీ తెలిపింది. B1/B2 వీసాలను రికార్డు స్థాయిలో ఏడు లక్షల వరకు జారీ చేసినట్లు కౌన్సులేట్ ప్రకటించింది. వీసా ప్రాసెసింగ్ కోసం నిరీక్షణ సమయాన్ని వెయ్యి రోజుల నుంచి 250 వరకు కుదించినట్లు తెలిపారు.