న్యూఢిల్లీ, జూన్ 23: భారత్లో అదనంగా మరో రెండు కాన్సులేట్లను నెలకొల్పనున్నట్టు అమెరికా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బెంగళూరు, అహ్మదాబాద్లలో ఇవి ఏర్పాటయ్యే అవకాశం ఉందని యూఎస్ సీనియర్ పాలనాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు భారత్, అమెరికా మధ్య వివిధ అంశాల్లో జరిగిన ఒప్పంద వివరాలను ఆయన వెల్లడించారు. భారత్ కూడా అమెరికాలో రెండు కాన్సులేట్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు.
దీంతో పాటు మానవ సహిత అంతరిక్ష యాత్రలో భాగంగా ఇస్రో-నాసా భాగస్వామ్యంతో వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. భారత వ్యోమగాములకు అమెరికాలో శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. ఈ మేరకు నాసాకు చెందిన ఆర్టెమిస్ అకార్డ్స్తో ఒప్పందం జరిగినట్టు తెలిపారు. భారత్లో సెమీ కండక్టర్ పరిశ్రమల్లో రూ.6600 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. మైక్రాన్ టెక్నాలజీ సాంకేతిక సాయంతో 60 వేల మంది ఇంజినీర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. జీఈ ఎఫ్-414 ఇంజిన్లను భారత్లో తయారు చేసేందుకు జనరల్ ఎలక్ట్రిక్, హెచ్ఏఎల్ మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. 5జీ, టెలి కమ్యూనికేషన్ రంగంలో భారత్-అమెరికా కలిసి పని చేయనున్నట్టు పేర్కొన్నారు.