న్యూఢిల్లీ: మద్యం మత్తులో తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఒక తాగుబోతుపై 30 రోజుల పాటు ప్రయాణ నిషేధం విధించినట్టు ఎయిర్ ఇండియా బుధవారం ప్రకటించింది. అంతేకాకుండా ఈ సంఘటనలో విమాన సిబ్బంది వైఫల్యం, పరిస్థితులను ఎదుర్కోవడంలో అనుసరించిన వైఖరిపై సైతం అంతర్గత విచారణ జరపనున్నట్టు తెలిపింది. దీనిపై తగు విచారణ జరిపి సంఘటనకు బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఎయిర్ ఇండియాను ఆదేశించినట్టు ఏవియేషన్ రెగ్యులేటరీ సంస్థ డీజీసీఏ తెలిపింది. ఈ దారుణ సంఘటన గత ఏడాది నవంబర్ 28న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా ైఫ్టెట్లో చేటుచేసుకుంది.
ఆ రోజు మద్యం మత్తులో ఉన్న ఒక ప్రయాణికుడు 70 ఏళ్ల తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. బాధితురాలు వెంటనే ఈ విషయాన్ని విమాన సహాయ సిబ్బందికి తెలియజేయగా, వారు ఆమెకు మరో సీటు ఇచ్చారే తప్ప నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో అతడు దర్జాగా విమానం దిగి వెళ్లిపోయాడు. తర్వాత బాధితురాలు ఎయిర్ ఇండియా చైర్మన్కు ఫిర్యాదు చేయగా ఆయన సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. కాగా, నిందితునిపై చర్యల్లో మొదటి భాగంగా ఎయిర్ ఇండియా ఆ ప్రయాణికుడిపై నెల రోజుల పాటు విమానాలలో ప్రయాణంపై నిషేధం విధించింది. అయితే ఈ నిషేధం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చేది తెలియజేయలేదు. అలాగే నిందితునిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.