UPSC | హైదరాబాద్ : ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్-2023 ఇంటర్వ్యూల షెడ్యూల్ విడుదలైంది. జనవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఈ మేరకు యూపీఎస్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల మెయిన్ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన యూపీఎస్సీ.. తాజాగా ఇంటర్వ్యూల షెడ్యూల్ను ప్రకటించింది. అభ్యర్థుల రోల్ నంబర్, ఇంటర్వ్యూ తేదీ, సమయంతో ప్రత్యేక షెడ్యూల్ను రూపొందించింది.
సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు మొత్తంగా 2,844 మంది అర్హత సాధించగా.. తొలుత 1,026 మంది అభ్యర్థులకు సంబంధించిన ఇంటర్వ్యూ షెడ్యూల్ను యూపీఎస్సీ విడుదల చేసింది. మిగతా అభ్యర్థుల షెడ్యూల్ను తర్వాత విడుదల చేయనున్నట్లు యూపీఎస్సీ పేరొన్నది. ఇంటర్వ్యూలకు సంబంధించి 1,026 మంది అభ్యర్థులకు త్వరలోనే ఈ-కాల్ లెటర్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు సంస్థ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం నిర్ణయించిన తేదీలు, సమయంలో మార్పు చేయాలన్న అభ్యర్థనలు స్వీకరించబోమని యూపీఎస్సీ స్పష్టంచేసింది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల రవాణా సంబంధిత ఖర్చులను రీయింబర్స్ చేస్తామని వెల్లడించింది. అయితే రైళ్లలో సెకండ్/స్లీపర్ తరగతుల ప్రయాణానికే డబ్బులు చెల్లించనున్నట్లు తెలిపింది.
గత మే నెలలో సివిల్స్ ప్రాథమిక పరీక్ష నిర్వహించగా.. దేశవ్యాప్తంగా సుమారు 5.5 లక్షల మంది హాజరయ్యారు. అందులో 14,624 మంది ప్రధాన పరీక్షలకు అర్హత సాధించారు. సెప్టెంబరు 15 నుంచి 24వ తేదీ వరకు మెయిన్ పరీక్షలు జరిగాయి. ఆ ఫలితాలు డిసెంబర్ 8న విడుదల చేసిన యూపీఎస్సీ.. తాజాగా ఇంటర్వ్యూలకు షెడ్యూల్ను ఖరారు చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 90 మంది వరకు ఇంటర్వ్యూలకు అభ్యర్థులు అర్హత సాధించినట్టు అంచనా.