న్యూఢిల్లీ: ఇవాళ 2023వ సంవత్సరానికి సంబంధించి సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు జరిగాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఈ పరీక్షలను నిర్వహించింది. రెండు సెషన్లలో పరీక్షలు జరిగాయి. మొదటి సెషన్లో భాగంగా ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు జనరల్ స్టడీస్ పరీక్ష, రెండో సెషన్లో భాగంగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సీ శాట్ పరీక్ష నిర్వహించారు.
ఈ ఏడాది సివిల్స్ పరీక్షల ద్వారా మొత్తం 1,105 పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష రాశారు. ఈ పరీక్షకు సంబంధించిన సమాధానాలతో కూడిన ‘కీ’ని బాలలతగారి నేతృత్వంలోని CSB ఐఏఎస్ అకాడమీ వారు రూపొందించారు. ఈ ‘కీ’ని కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అంతిమంగా UPSC వారు విడుదల చేసే ‘కీ’ని మాత్రమే ప్రమాణికంగా తీసుకోగలరు.
మొత్తం నాలుగు సెట్ల (సెట్-A, సెట్-B, సెట్-C, సెట్-D) ప్రశ్న పత్రాలకు సంబంధించిన సమాధానాలు ఈ ‘కీ’లో ఉన్నాయి. ఈ ‘కీ’తోపాటు సెట్-D ప్రశ్నపత్రాన్ని అందిస్తున్నాం. కాగా, ఇవాళ్టి ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్లో పాలిటీ నుంచి 16, ఎన్విరాన్మెంట్ నుంచి 12, ఎకానమీ నుంచి 19, కరెంట్ అఫైర్స్, ప్రభుత్వ పథకాలు, క్రీడల నుంచి 5, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి 10, జాగ్రఫీ నుంచి 20, చరిత్ర నుంచి 12, అంతర్జాతీయ సంబంధాల నుంచి 6 ప్రశ్నలు వచ్చాయి.
ఇక ప్రిలిమ్స్ కటాఫ్ విషయానికి వస్తే 2019లో జనరల్ అభ్యర్థులకు 98, EWS అభ్యర్థులకు 90, OBC అభ్యర్థులకు 95.34, SCలకు 82, STలకు 77.34 కటాఫ్ మార్కులుగా ఉన్నాయి. ఈ ఏడాది జనరల్ అభ్యర్థులకు 86-91, EWS అభ్యర్థులకు 79-84, OBC అభ్యర్థులకు 85-89, SC అభ్యర్థులకు 72-76, ST అభ్యర్థులకు 68-74 కటాఫ్ మార్కులుగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.