Unified Pension Scheme | ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పాత పెన్షన్ స్కీమ్ (OPS) కోసం డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త పెన్షన్ స్కీమ్ (NPS)కి బదులుగా కొత్తగా ఏకీకృత పెన్షన్ స్కీమ్ (Unified Pension Scheme) ప్రారంభించాలని నిర్ణయించింది. కేంద్రమంత్రి వర్గల సమావేశంలో కొత్త పెన్షన్ స్కీమ్పై ఏకాభిప్రాయం కుదిరింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు. ఎన్పీఎస్ పథకాన్ని మెరుగుపరచాలని దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఎప్పటి నుంచో డిమాండ్ ఉందన్నారు. ఇందులో సంస్కరణల కోసం ఏప్రిల్ 2023లో ప్రధాని నరేంద్ర మోదీ ఓ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. కమిటీకి డాక్టర్ సోమనాథన్ చైర్మన్గా ఉన్నారన్నారు.
కమిటీ వందకుపైగా ప్రభుత్వ ఉద్యోగుల సంస్థలతో సంప్రదింపులు జరిపిందని.. దాదాపు అన్ని రాష్ట్రాలతోనూ చర్చలు జరిపిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంస్థలకు సైతం ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ఈ అంశాన్ని ప్రధాని సీరియస్గా తీసుకున్నారని.. కమిటీ సిఫారసు మేరకు ఏకీకృత పింఛన్ స్కీమ్కు ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఇక 25 ఏళ్లు పనిచేసే ఉద్యోగికి పూర్తి పెన్షన్ వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. యూపీఎస్ స్కీమ్ ద్వారా 23లక్షల మంది కేంద్ర ఉద్యోగులు లబ్ధి పొందనుండగా.. ఏప్రిల్ 1, 2025 నుంచి అమలులోకి రాబోతున్నది. పదేళ్లు సర్వీస్ చేసిన వారికి రూ.10వేల పెన్షన్ వస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే వారి భార్యలకు 60శాతం పెన్షన్ ఇస్తారని పేర్కొన్నారు. సర్వీస్లో 25 సంవత్సరాలు పూర్తయిన వారికి పూర్తి పెన్షన్ స్కీమ్ని కేంద్రం తెచ్చింది. మరో వైపు కేంద్ర ప్రభుత్వం బయో ఈ-3 విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్షిప్కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) సమీకృత కేంద్ర రంగ పథకం ‘సైన్స్ స్ట్రీమ్’లో విలీనమైన మూడు ప్రధాన పథకాలను కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ‘విజ్ఞాన్ ధార’ పథకం ప్రాథమిక లక్ష్యం దేశంలో సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణలకు సంబంధించిన పర్యావరణ వ్యవస్థను పటిష్టం చేయడం కోసం శాస్త్ర, సాంకేతికతలో సామర్థ్య పెంపుతో పాటు పరిశోధన, ఆవిష్కరణ-సాంకేతిక అభివృద్ధిని ప్రోత్సహించడం. ఈ పథకం అమలు విద్యాసంస్థల్లో పూర్తిగా సన్నద్ధమైన పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాలలను ప్రోత్సహించడం ద్వారా దేశంలోని శాస్త్ర సాంకేతిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయనున్నది.