Uniform Civil Code : దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి బిల్లును తీసుకు వచ్చే దిశగా కేంద్రప్రభుత్వం మరో అడుగు వేసింది. రాజ్యసభలో శుక్రవారం ఉమ్మడి పౌరస్మృతి బిల్లు-2020ను ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాల ఆందోళనల నడుమ బీజేపీ రాజస్థాన్ ఎంపీ కిరోడి లాల్ మీనా యూనిఫార్మ్ సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు దేశ సమగ్రతను ముక్కలు చేస్తుందని, వైవిధ్యమైన భారతీయ సంస్కృతిని దెబ్బతీస్తుందని విపక్షాలు ఆరోపించాయి. వెంటనే బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ ప్రైవేటు బిల్లును విపక్ష కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ (ఎమ్), తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కర్ ఓటింగ్ నిర్వహించారు. 63 ఓట్లు అనుకూలంగా, 23 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో మెజారిటీ ఓటింగ్ ప్రకారం ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ప్రవేశపెట్టారు. జాతీయ దర్యాప్తు, పరిశోధన కమిటీకీ ఈ బిల్లును రూపొందించే బాధ్యత అప్పగించాలని, దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేలా చూడాలని కిరోడి లాల్ రాజ్యసభకు విన్నవించారు.
గతంలో కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టాలనుకున్నారు. కానీ కుదరలేదు. దాంతో, కేంద్రంలో పూర్తి మెజారిటీతో ఉన్న బీజేపీ మళ్లీ ఈ బిల్లును తెరపైకి తీసుకొచ్చింది. యూనిఫార్మ్ సివిల్ కోడ్ అనేది బీజేపీ అజెండాలో ఒకటి. ఈ బిల్లు చట్టంగా మారితే.. మతం, లింగంతో సంబంధం లేకుండా దేశంలోని ప్రజలందరికీ హక్కులను కాపాడేందకు చట్టాలను రూపొందించే అవకాశం ఉంటుంది. ఆర్టికల్ 44 ప్రకారం భారతదేశంలోని ప్రజలకు ఆదేశిక సూత్రాలతో పాటు ఉమ్మడి చట్టంను అమలు పరిచే అధికారం కేంద్రానికి ఉంటుంది.