న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాలలో జడ్జీల నియామకం విషయంలో కేంద్రం, సుప్రీంకోర్టు కొలీజియం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన రోజు రోజుకూ పెరుగుతున్నది. తాజాగా కేంద్ర న్యాయ శాఖ కొలీజియంపై కుల వివక్ష ఆరోపణలు చేసినట్టు ప్రముఖ ఆంగ్ల పత్రిక వార్తా కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం.. ఉన్నత న్యాయ వ్యవస్థలో సామాజిక వైవిధ్యం సమస్యను పరిష్కరించేందుకు కొలీజియం ఎటువంటి కృషి చేయలేదని కేంద్ర న్యాయ శాఖ ఆరోపించింది. ఐదేండ్లలో (2018-2022) దేశంలోని అన్ని హైకోర్టులలో నియమించిన జడ్జీలలో 79 శాతం మంది ఉన్నత కులాలకు చెందినవారేనని తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ బీజేపీ ఎంపీ సుశీల్ మోదీ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీకి ఒక నివేదికను సమర్పించింది.
ఆ ఐదేండ్లలో వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు చెందిన వారికి అతి తక్కువ ప్రాధాన్యం లభించిందని తెలిపింది. గత మూడు దశాబ్దాలలో కొలీజియం వ్యవస్థ ఉన్నత న్యాయస్థానాలలో సామాజిక వైవిధ్యం సమస్యను పరిష్కరించలేకపోయిందని పేర్కొంది. గత ఐదేండ్ల కాలంలో 537 మందిని హైకోర్టులకు జడ్జీలుగా నియమిస్తే వారిలో 424 (79%) మంది ఉన్నత కులాలవారు, 57 (11%) మంది ఓబీసీలు, 15 (2.8%) మంది ఎస్సీలు, ఏడుగురు (1.3%) ఎస్టీలని వివరించింది. మరో 20 మంది జడ్జీలు ఏ కులానికి చెందినవారో తెలియరాలేదని పేర్కొంది. ఈ నియామాకాల్లో ఓబీసీల పట్ల స్పష్టమైన వివక్ష కనిపిస్తున్నట్టు ప్రభుత్వం తన నివేదికలో తెలిపింది.
దేశ జనాభాలో ఓబీసీలు 35 శాతం మంది ఉండగా, ఆ వర్గానికి చెందిన వారు జడ్జీలుగా 11 శాతం మాత్రమే నియమితులయ్యారని పేర్కొంది. న్యాయస్థానాల్లో నియామకాలు జరిపే ముందు సామాజిక వైవిధ్యం, సామాజిక న్యాయం పాటించాల్సిన ప్రాథమిక బాధ్యత సుప్రీంకోర్టు, హైకోర్టు కొలీజియంలకు ఉంటుందని తెలిపింది. న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లను పాటించే అవకాశం లేదని, సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసినవారినే ప్రభుత్వం జడ్జీలుగా నియమిస్తుందని తెలిపింది. జడ్జీల నియామకాల్లో సామాజిక న్యాయం పాటించి అణగారిన వర్గాల వారికి అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని తాము సుప్రీం కోర్ట్, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు, ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొంది.
న్యాయ శాఖ మోదీ ప్రభుత్వం నెలకొల్పిన నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్జాక్) విషయాన్ని కూడా ప్రస్తావించినట్టు ఆ పత్రిక వెల్లడించింది. ఎన్జాక్ సభ్యుల్లో ఇద్దరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారు లేదా మైనారిటీలు లేదా ఓ మహిళ ఉండాలని ప్రతిపాదిస్తే సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని కొట్టివేసిందని కేంద్రం వెల్లడించింది.