న్యూఢిల్లీ: రైల్వేల ఆధునీకరణపై కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. నగరాలు, పట్టణాలకు మెట్రో, నమో రైళ్లను విస్తరించాలని నిర్ణయించింది. 40 వేల సాధారణ బోగీలను వందే భారత్ బోగీ ప్రమాణాల స్థాయికి మార్చనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్లో వెల్లడించారు. అంతేకాకుండా ఈ శాఖను మూడు ప్రధాన ఆర్థిక కారిడార్లుగా ఏర్పాటు చేయనున్నారు. వీటిని ప్రధాని గతి శక్తి కింద గుర్తించి వివిధ మార్గాల ద్వారా అనుసంధానిస్తారు.
ఈ నడవాల ఏర్పాటుతో అత్యధిక ట్రాఫిక్ కారిడార్లపై ఒత్తిడి తగ్గడమే కాక, సరుకు రవాణా మరింత మెరుగవుతుందని, ఖర్చు కూడా బాగా తగ్గుతుందని చెప్పారు. ప్రస్తుత కోచ్లను వందే భారత్ స్థాయి ప్రమాణాలతో మార్పు చేయడం వల్ల భద్రతా ప్రమాణాలు పెరిగి ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణ సౌకర్యం కలుగుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మూడు రైల్వే కారిడార్లలో మొదటిది ‘విద్యుత్, ఖనిజ, సిమెంట్’ కారిడార్ కాగా, రెండోది పోర్టులను అనుసంధానించే కారిడార్. మూడోది ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్.