పట్నా : జేడీ(యూ)కు దూరమైన సీనియన్ నేత, ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు చీఫ్ ఉపేంద్ర కుష్వాహ కీలక నిర్ణయం తీసుకున్నారు. జేడీ(యూ)ను వీడి రాష్ట్రీయ లోక్ జనతాదళ్ పేరిట కొత్త పార్టీ స్ధాపించామని కుష్వాహ సోమవారం వెల్లడించారు. రాష్ట్రీయ లోక్ జనతాదళ్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని తాము నిర్ణయించామని నూతన పార్టీకి తాను జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తానని ప్రకటించారు.
కర్పూరి ఠాకూర వారసత్వాన్ని తమ పార్టీ ముందుకు తీసుకువెళుతుందని తెలిపారు. ఆర్జేడీతో జేడీయూ ఒప్పందాన్ని తాము వ్యతిరేకిస్తామని తెలిపారు. గత రెండు రోజులుగా పట్నాలో పార్టీ నేతలతో సుదీర్ఘంగా సాగిన సంప్రదింపుల అనంతరం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కుష్వాహ వెల్లడించారు. విధాన మండలి సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు.
గత రెండు రోజులుగా తాను నిర్వహించిన ఓపెన్ సెషన్కు పెద్ద సంఖ్యలో జేడీయూ కార్యకర్తలు, నేతలు హాజరై అభిప్రాయాలు తెలిపారని చెప్పారు. ఈరోజు నూతన రాజకీయ అధ్యాయం ఆరంభమైందని వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్ ఆరంభంలో మెరుగ్గా పనిచేసినా ఆపై ఆయన రాజకీయ ఒరవడి నితీష్తో పాటు బిహార్కు చేటు చేస్తుందని పేర్కొన్నారు. నితీష్ ప్రస్తుతం సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని, తన చుట్టూ చేరిన కోటరీ సలహాలు పాటిస్తున్నారని కుష్వాహ ఆరోపించారు.