ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో గత శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. ప్రమాదం జరిగిన రోజే ఏడుగురు ప్రాణాలు కోల్పోగా ఇవాళ మరో ఇద్దరు బాధితులు మరణించారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. కాగా, ఈ ప్రమాదంలో గాయపడిన 21 మందిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు.
మరో ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉన్నదన్నారు. మిగతా 13 మంది గాయాల నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు వైద్యులు వెల్లడించారు. గత శనివారం ఉదయం దక్షిణ ముంబైలోని నానాచౌక్ ఏరియాలోగల 20 అంతస్తుల కమలా బిల్డింగ్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 18వ అంతస్తులో మంటలు చెలరేగి ఒక్కసారిగా అంతటా విస్తరించాయి.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలంటుకుని క్షతగాత్రులైన 30 మందిని మూడు వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఏడుగురు అదేరోజు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఇవాళ మరణించారు.