లక్నో : ఉత్తరప్రదేశ్ అలీఘర్ జిల్లాలోని షాహ్ నగర్ సారౌలా గ్రామంలో కోవిడ్ టెస్టులు చేసేందుకు ఆరోగ్య శాఖ అధికారులు వెళ్లారు. ఓ 37 మందికి కరోనా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించిన అనంతరం.. ఓ కొత్త పెళ్లి కూతురు వచ్చింది. ఆ నవ వధువు ముఖాన్ని కొంగుతో కవర్ చేసుకుంది. అక్కడున్న వారి ముందు ముఖంపై ఉన్న కొంగును తొలగించేందుకు సిగ్గుపడింది.
ఆ సమయంలో ఆరోగ్యశాఖ అధికారులు.. అక్కడ ఉన్న మగవారిని ఆమెకు కొంత ప్రైవసీ ఇవ్వాలని కోరారు. తలపై ఉన్న కొంగును తీసేందుకు నిరాకరించడంతో అధికారులు ఆ గ్రామస్తుల్ని వేడుకున్నారు. అయితే ఆ చోటు నుంచి మగవారిని దూరం వెళ్లమని అడిగినందుకు.. వాళ్లు ఆరోగ్యశాఖ అధికారులపై చేయి చేసుకున్నారు. ఈ దాడిలో ఇద్దరు ఆరోగ్య సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.