ముజఫర్నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. ఇంటిపెద్దగా అండగా నిలువాల్సిన మామ, కట్టుకున్న భర్తే ఓ మహిళ పాలిట కాలయములయ్యారు. ఇంట్లో కొడుకు లేని సమయం చూసి కోడలిపై అత్యాచారం చేసిన మామ గురించి బాధితురాలు భర్తకు చెప్పుకుంటే.. అతను ఆమెను కొట్టి ఇంట్లో నుంచి తరిమేశాడు. దాంతో బాధితురాలు పుట్టింటికి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలికి ఏడాది క్రితం వివాహం జరిగింది. ఈ క్రమంలో భర్త ఇంట్లో లేని సమయం చూసి ఆమె మామ ఆగస్టు 5న కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ప్రతిఘటించినా తీవ్రంగా కొట్టి మరీ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత విషయం బయటికి చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయితే, మామ ఆగడాలు మితిమీరడంతో ఆమె తన భర్తకు విషయం చెప్పింది. దాంతో తన తండ్రిపైనే నింద వేస్తావా..? అని భర్త ఆమెను కొట్టి ఇంట్లోంచి తరిమేశాడు.
దాంతో పుట్టింటికి వెళ్లిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బాధితురాలి మామను, భర్తను అదుపులోకి తీసుకున్నారు. కాగా, తనపై కోడలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని, తాను ఆమెపై అత్యాచారానికి పాల్పడలేదని బాధితురాలి మామ చెబుతున్నాడు.