లక్నో: దేశంలో అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలున్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ అవతరించనుంది. రాష్ట్రంలో ఇప్పటికే రెండు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులు ఉన్నాయి. వీటికి తోడు కొత్తగా నిర్మిస్తున్న మూడు విమానాశ్రయాలు మరో రెండేండ్లలో అందుబాటులోకి రానున్నాయి. దీంతో రాష్ట్రంలో అంతర్జాతీయ విమానాశ్రయాల సంఖ్య ఐదుకు చేరనుంది. ప్రస్తుతం లక్నో, వారణాసిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులు ఉన్నాయి. ఇప్పటివరకు కేరళలో అత్యధికంగా నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఖుషీనగర్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్), అయోధ్యలో విమానాశ్రయాలను నిర్మిస్తున్నది. కుషీనగర్ ఎయిర్పోర్టుకోసం సీఎం యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం రూ.200 కోట్లు మంజూరుచేసింది. దీనికి ఈమధ్యే డీజీసీఏ అనుమతి లభించింది. దీంతో వారణాసి, లక్నో తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లైసెన్స్ పొందిన విమానాశ్రయంగా నిలిచింది.
కాగా, ఎన్సీఆర్ పరిధిలో నిర్మిస్తున్న జెవర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 2023 నాటికి సిద్ధంకానుంది. అదేవిధంగా అయోధ్యలో విమానాశ్రయ నిర్మాణపనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇది వచ్చే ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి రానుంది.
ఈ విమానాశ్రయాల్లో కార్యకలాపాలు ప్రారంభమైతే రాష్ట్రంలో పర్యాటక రంగానికి దన్నుగా నిలుస్తాయని ప్రభుత్వం అంచనావేస్తున్నది. కాగా, ప్రముఖ పర్యాటక కేంద్రమైన కుషీనగర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో బౌద్ధమతస్థుల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నది.
బౌద్ధారామాలైన లుంబినీ, శ్రవస్తి, కపిలవస్తు, సారనాథ్, గయా మధ్య కుషీనగర్ ఉన్నది. ఇప్పటికే ఇక్కడికి దేశీయ పర్యాటకులతోపాటు థాయ్లాండ్, చైనా, మలేషియా, థాయ్లాండ్, జపాన్, సింగపూర్ నుంచి భారీసంఖ్యలో టూరిస్టులు వస్తున్నారు. ఈ ఎయిర్పోర్టు అందుబాటులోకి వస్తే ఇది మరింతగా పెరగనుంది.