లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. నాల్గో దశ ఎన్నికల పోలింగ్ ఈ నెల 23న జరుగనున్నది. 624 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రధానంగా బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవగా.. బందా, ఫతేపూర్, హర్దోయ్, లఖింపూర్ ఖేరి, లక్నో, రాయ్ బరేలీ, సీతాపూర్, పిలిభిత్, ఉన్నావ్లో పోలింగ్ జరుగునున్నది. ఇందులో రాయ్ బరేలీ కాంగ్రెస్ కంచుకోట కాగా.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
నాల్గో దశ ఎన్నికల్లో 167 మంది (27శాతం) అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 129 మంది అభ్యర్థులపై తీవ్ర ఆరోపణలున్నాయి. కళంకితులకు ఎక్కువ సీట్లు ఇచ్చిన జాబితాలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు తొలివరుసలో నిలిచాయి. 53శాతం మంది చొప్పున రెండు పార్టీలు కళంకిత అభ్యర్థులకు టికెట్లు ఇచ్చాయి. ఆ తర్వాత స్థానంలో బీఎస్పీ 44శాతం మంది అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. బీజేపీ 40శాతంతో నాలుగో స్థానంలో, 24శాతంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఐదోస్థానంలో నిలిచాయి.
తొమ్మిది మంది అభ్యర్థులు మహిళలపై తీవ్రమైన నేరాలకు పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి. ఇద్దరు అభ్యర్థులు మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరు అశోక్కుమార్. రాయ్బరేలీలోని హర్చందర్పూర్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరో అభ్యర్థి సీతాపూర్లోని సేవాతా స్థానం నుంచి సమాజ్ వాదీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మహేంద్రకుమార్ సింగ్. ఐదుగురు అభ్యర్థు తమపై హత్య కేసు ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు.
14 మంది అభ్యర్థులు హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 59లో 29 అంటే 49శాతం సీట్లు రెడ్ అలర్ట్ జోన్లో ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు నేర నేపథ్యం ఉన్నది. అత్యధికంగా సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా లక్నోలోని సెంట్రల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న రవిదాస్ మెహ్రోత్రాపై అత్యధికంగా 22 కేసులు, 74 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఇందులో 16 సీరియస్ సెక్షన్లు నమోదయ్యాయి. మహిళను చిత్రహింసలకు గురిచేయడం, కులం, మతం పేరుతో దుష్ప్రచారం చేయడం తదితర తీవ్ర ఆరోపణలు రవిదాస్పై ఉన్నాయి.