Lucknow ఉత్తర ప్రదేశ్ బీజేపీలో తుపాన్ కొనసాగుతోంది. కార్మిక మంత్రి స్వామి మౌర్య రాజీనామా చేసి, 24 గంటలు గడిచిందో లేదో మరో మంత్రి రాజీనామా చేసేశారు. అటవీ, ఉద్యానవన మంత్రి దారాసింగ్ చౌహాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేసేశారు. వీరిద్దరూ ఓబీసీ వర్గానికి చెందిన వారే కావడం విశేషం. దారా సింగ్ మవూలోని మధుబన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యూపీ ప్రభుత్వం దళితులు, వెనుకబడిన వర్గాల వారి మద్దతుతోనే ఏర్పడిందని, అయినా వారి విషయంలో అశ్రద్ధ వహిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే తదుపరి కార్యాచరణ ఏంటన్న విషయంలో కార్యకర్తలతో సమాలోచన జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని దారాసింగ్ చౌహాన్ పేర్కొన్నారు. చాలా నిబద్ధతతో మంత్రి బాధ్యతలు నిర్వర్తించా. అయితే వెనుకబడిన వర్గాలు, దళితులు, అణగారిన వర్గాల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో చాలా బాధపడుతున్నా. అందుకే రాజీనామా చేస్తున్నాను అని దారా సింగ్ చౌహాన్ ప్రకటించారు.
మంత్రి దారాసింగ్ చౌహాన్ రాజీనామాపై యూపీ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య స్పందించారు. రాజీనామాపై పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యుల్లోని వారు ఎవరైనా దారి తప్పితే మిగితా వారు చాలా బాధపడతారని, మునిగిపోతున్న నావను ఎక్కడం అంత భావ్యం కాదని పరోక్షంగా సమావజ్వాదీనుద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. దయచేసి రాజీనామాపై పునరాలోలించుకోవాలని కేశవ ప్రసాద్ మౌర్య విజ్ఞప్తి చేశారు.