లక్నో: తనపై వ్యతిరేకంగా కథనం రాసిన వార్తా ప్రతికపై ఒక వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ వార్తా పత్రిక కార్యాలయం ముందు రెండు గంటలపాటు ఉండి మైకులో తిట్టేందుకు అనుమతించాలని కోరాడు. ఈ మేరకు అధికారులకు లేఖ రాశాడు. (Man Seeks Permission To Abuse Newspaper) ఆ వ్యక్తి విచిత్ర విన్నపంతో కూడిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జనవరి 9న ప్రతీక్ సిన్హా అనే వ్యక్తికి చెందిన స్థలంలో అధికారులు బుల్డోజర్తో చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో స్థానిక వార్తా పత్రిక ఈ సంఘటనపై కథనాన్ని ప్రచురించింది. ప్రతీక్ సిన్హాను భూకబ్జాదారుడిగా, ల్యాండ్ మాఫియాగా ఆరోపించింది.
కాగా, స్థానిక వార్తా పత్రికలో వచ్చిన ఈ కథనంపై ప్రతీక్ సిన్హా తీవ్రంగా స్పందించాడు. తన నుంచి వివరణ తీసుకోకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా తనను భూకబ్జాదారుడిగా, ల్యాండ్ మాఫియాగా ఆ వార్తా పత్రిక ఆరోపించడంపై మండిపడ్డాడు. తన ప్రతిష్టను దిగజార్చినందుకు ఆ వార్తాపత్రికకు పరువు నష్టం నోటీసు పంపాడు.
మరోవైపు సిన్హా అక్కడితో ఆగలేదు. తనపై వ్యతిరేకంగా కథనం రాసిన ఆ వార్త పత్రికను దూషించేందుకు అనుమతి కోసం సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్కు లేఖ రాశాడు. ‘ఈ కథనానికి వ్యతిరేకంగా బ్యూరో చీఫ్, రిపోర్టర్ను రెండు గంటల పాటు దుర్భాషలాడి నా మనోవేదన తెలియజేసేందుకు జనవరి 15 మధ్యాహ్నం 12:00 గంటలకు నేను అనుమతి కోరుతున్నా’ అని ఆ లేఖలో పేర్కొన్నాడు.
కాగా, ఆ పత్రికా కార్యాలయం వద్ద ఎలాంటి హింసకు పాల్పడబోనని, బెదిరింపులకు పాల్పడే ఉద్దేశం కూడా తనకు లేదని ఆ లేఖలో సిన్హా స్పష్టం చేశాడు. అయితే అధికారులు ఈ లేఖపై స్పందించలేదు. మరోవైపు విచిత్ర విన్నపంతో కూడిన ఈ లేఖ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.