లక్నో: బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లో రోడ్లు గుంతలమయంగా మారాయి. దీంతో నిత్యం పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీని గురించి ఒక వ్యక్తి లైవ్లో ఫిర్యాదు చేస్తుండగా అతడి వెనుక వెళ్తున్న ఒక ఆటో రోడ్డుపై ఉన్న గోతిలో పడి బోల్తా పడింది. యూపీలోని బల్లియాలో ఈ సంఘటన జరిగింది. స్థానికుడైన ప్రవీర్ కుమార్, అక్కడి రోడ్ల దుస్థితిపై ఒక టీవీ ఛానెల్తో లైవ్లో మాట్లాడుతున్నాడు. ఇంతలో విద్యుత్తో నడిచే ఈ ఆటో ఆ వ్యక్తి వెనుకగా వెళ్లింది. అయితే ఆ రోడ్డుపై ఉన్న భారీ గుంత మీదుగా వెళ్లిన ఆ ఆటో అనంతరం ఒక్కసారిగి ఒక పక్కకు ఒరిగిపోయింది.
మరోవైపు ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు వెంటనే స్పందించారు. అంతా తలో చేయి వేసి పక్కకు ఒరిగిపోయిన ఆ ఈ- ఆటోను పైకి లేపారు. అయితే ఆ ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళ, మరో వృద్ధుడు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. . కాగా, గుంతలమయమైన ఈ రోడ్డుపై ప్రమాదాలు నిత్యకృత్య మయ్యాయని కుమార్ ఆరోపించాడు. గత నాలుగేళ్లుగా ఈ రోడ్డు దుస్థితి ఇలాగే ఉందని చెప్పాడు. ఇప్పడు జరిగిన మాదిరిగా రోజుకు కనీసం 20 ప్రమాదాలు జరుగుతుంటాయని విమర్శించాడు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ దుయ్యబట్టాడు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.