లక్నో: హత్యకు గురైన వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలకు ముందు అతడు మరోచోట సజీవంగా కనిపించాడు. (man found alive before cremation) ఈ విషయం తెలుసుకున్న యువకుడి కుటుంబ సభ్యులతోపాటు పోలీసులు షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 31న 18 ఏండ్ల వయసున్న మోంటు, అదే వయసున్న యువతి కలిసి ఇంటి నుంచి పారిపోయారు. తమ కుమార్తెను మోంటు కిడ్నాప్ చేసినట్లు యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ జంటను వెతికేందుకు పోలీస్ బృదాలను ఏర్పాటు చేశారు.
కాగా, సెప్టెంబర్ 13న మోంటు కుటుంబ సభ్యులకు మీరట్ పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. కాలువలో కనిపించిన తల లేని యువకుడి మృతదేహాన్ని గుర్తించాలని కోరారు. మార్చురీకి వెళ్లిన తల్లిదండ్రులు, టాటూ ఆధారంగా ఆ మృతదేహం మోంటుదేనని తెలిపారు. బుధవారం రాత్రి మృతదేహంతో ముజఫర్నగర్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. యువతి కుటుంబ సభ్యులు తమ కుమారుడ్ని హత్య చేసినట్లు ఆరోపించారు. గురువారం ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
మరోవైపు మోంటు, ఆ యువతి చండీగఢ్లో ఉన్నట్లు ముజఫర్నగర్ పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో కుమారుడిదిగా భావించిన మృతదేహానికి అంత్యక్రియలను మోంటు కుటుంబ సభ్యులు విరమించారు. అయితే తల లేని ఆ మృతదేహం ఎవరిది, మోంటూదిగా తల్లిదండ్రులు ఎందుకు పొరపడ్డారు అన్నదానిపై మీరట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.